ప్రభుత్వం టీచర్ల పట్ల వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా టీచర్స్ డే బాయ్ కాట్

by Disha Web Desk 16 |
ప్రభుత్వం టీచర్ల పట్ల వ్యవహరిస్తోన్న తీరుకు నిరసనగా టీచర్స్ డే బాయ్ కాట్
X

దిశ, ఏపీ బ్యూరో : గురుపూజోత్సవం అంటే అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఒక పండుగ వాతావరణం. గురువులను స్మరించుకుంటే.. వారిని సన్మానించుకుని వారికి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. అలాంటి గురుపూజోత్సవాన్ని ఏకంగా టీచర్లే బాయ్ కాట్ చేస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయులే టీచర్ల దినోత్సవాన్ని బహిష్కరించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది.

సెప్టెంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమాలను బహిష్కరిస్తునట్లు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె సురేష్‌ కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి యన్‌.నాగమణి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు జె.ఎల్లప్ప, యస్‌.యం.జయరాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు యూటీఎఫ్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లను వేధిస్తోందని ఆరోపించారు. ఏడాది పోడవునా యాప్‌ల పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు.

న్యాయమైన తమ డిమాండ్ కోసం పోరాటం చేస్తుంటే బైండోవర్ కేసులు పెట్టడం.. పోలీసులను పాఠశాలకు పంపి నోటీసులు ఇప్పించడం ద్వారా తమ మనోభవాలను ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. విద్యార్థుల దృష్టిలో ఉపాధ్యాయులను నేరస్థులుగా చిత్రీకరించారని, ఉపాధ్యాయులపై బైండవర్‌ కేసులు పెట్టి, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం వంటి ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటాన్ని యూటీఎఫ్ ఖండిస్తోందని అన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు రాష్ట్ర జిల్లా, మండల స్థాయిలో సెప్టెంబర్‌ 5న నిర్వహించే కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కే సురేశ్ కుమార్ ప్రకటనలో తెలిపారు.

Also Read : ఏపీలో టీచర్స్ డే లేనట్లే.. ఉపాధ్యాయ సంఘాలు సంచలన నిర్ణయం

Next Story

Most Viewed